చరిత్ర
బషీరాబాద్ గ్రామమును పూర్వం వెంకటాపురం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న కాడీచెరువు ప్రాంతంలోని లంబడ దుబ్బ ప్రాంతంలో వెంకటాపురం గ్రామం ఉండేది. ఈ ప్రాంతంలో దట్టమయిన అడవి, క్రూరమయిన జంతువులతో ఈ ప్రాంతం నిండుకొని ఉండేది. నైజాం నవాబుల కాలంలో సురక్షిత ప్రదేశానికి ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలించారు. ఈ గ్రామాన్ని బషీర్ అహ్మద్ పరిపాలించేవాడు. ఇతను మరణించడంతో వెంకటాపురం గ్రామాన్ని 'బషీరాబాద్' గా నామకరణం చేశారు.
బషీర్ ఆహ్మద్ సమాధి దూలగుట్ట వెనుక భాగంలో చింతల్ చెరువు కట్ట ప్రారంభంలో ఉన్నది. ఈ సమాధిని 'బషీర్ సాములు' అంటారు. అభిమానులు కొందరు ఇప్పటికీ ఈ సమాధి వద్ద ప్రతి శుక్రవారం పూజలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామాన్ని తదుపరి కాలంలో వలస వాదులయిన ఎల్లాపు దొరలు పరిపాలించారు. భూస్వాములుగా గోపు చొక్కారావు, గోపు జీవన్ రావులు మరియు గోపు వెంకట భాస్కరరావులు ఈ గ్రామాన్ని పరిపాలించారు. ఈ గ్రామస్తులు ఎల్లాపు దొరల భూస్వామ్య పోకడలను ఎదురించడంతో వీరి పరిపాలన అంతరించింది.రెవేన్యూ రికార్డుల్లో కొంతభూభాగాన్ని "వెంకటాపురం"గానే వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులంతా ఈ గ్రామాన్ని "వెంకటాపురం"గానె మర్చాలని డిమాండ్ చేస్తున్నారు.